ANDHRABREAKING NEWS

శ్రీసిటీ-ఐఎఫ్ఎఫ్ పరిశ్రమచే మాదనపాళెం

తెలుగు వార్త :న్యూస్

శ్రీసిటీ-ఐఎఫ్ఎఫ్ పరిశ్రమచే మాదనపాళెంలో కమ్యూనిటీ లైబ్రరీ ప్రారంభం

 

తెలుగు వార్త న్యూస్:శ్రీసిటీ, ఏప్రిల్ 01, 2022:

 

శ్రీసిటీలోని ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నాన్సెస్ (ఐఎఫ్ఎఫ్) పరిశ్రమ యాజమాన్యం తమ సీఎస్ఆర్ చర్యల్లో భాగంగా రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ (రీడ్) సంస్థ భాగస్వామ్యంతో శ్రీసిటీ పరిధిలోని మాదనపాళెం గ్రామంలో కమ్యూనిటీ లైబ్రరీ & రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. రీడ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ రంగశ్రీ కిషోర్ సమక్షంలో శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా రంగశ్రీ కిషోర్ మాట్లాడుతూ, విద్య మరియు కమ్యూనిటీ అభివృద్ధిని ప్రోత్సహించడమే రీడ్ కమ్యూనిటీ లైబ్రరీ మరియు రిసోర్స్ సెంటర్ (CLRC) ముఖ్య ఉద్దేశ్యమని చెబుతూ, దీని వలన ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ఈ తరహా సెంటర్లను ప్రభుత్వాలు, స్పాన్సర్ల మద్దతుతో గ్రామస్థుల భాగస్వామ్యంతో తమ సంస్థ భారతదేశం అంతటా 12 రాష్ట్రాలలోని 18 జిల్లాలలో 230 పైగా గ్రామాలలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రెండేళ్ల క్రితం ఇరుగుళం గ్రామంలో ఈ సెంటర్ ను ప్రారంభించామని, దానికి కొనసాగింపుగా నేడు మాదనపాళెంలో మరొకటి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఐఎఫ్ఎఫ్ పరిశ్రమ యాజమాన్యానికి, శ్రీసిటీ ఫౌండేషన్ కు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. దీనిని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో, ఐఎఫ్ఎఫ్ పరిశ్రమ యాజమాన్యం రీడ్ ఇండియా ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. శ్రీసిటీ పరిధిలోని రెండు గ్రామాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఈ గ్రామస్థులు, ముఖ్యంగా విద్యార్ధులు, మహిళలు, దీని నుండి మంచి ఫలితాలను పొందుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

 

శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ రమేష్, మండల విద్యాశాఖాధికారి రవి, మాదనపాళెం స్కూల్ ప్రధానోపాధ్యాయులు మునిమోహన్, శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్రకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కాగా, గ్రామంలోని పిల్లలకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలతో పాటు, యువతి యువకులకు చేతివృత్తులు, ఆరోగ్య అవగాహన కల్పించడం ఈ రీడ్ కమ్యూనిటీ లైబ్రరీ మరియు రిసోర్స్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం. రీడ్ ఇండియా సంస్థ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న రీడ్ గ్లోబల్ యొక్క అనుబంధ సంస్థ. ఇది ఎలాంటి లాభాపేక్షలేకుండా ప్రాథమిక విద్యా సౌకర్యాలు లేని గ్రామీణ ప్రజలకు సమాచారం మరియు అవకాశాలను అందిస్తుంది. కమ్యూనిటీ లైబ్రరీ మరియు రిసోర్సు సెంటర్లో లైబ్రరీ, కంప్యూటర్ రూమ్, శిక్షణా హాల్, పిల్లలు, మహిళలకు విభాగాలు ఉన్నాయి. గ్రామస్థుల అవసరం, ఆసక్తి అభిప్రాయాల మేరకు వారికి ఎలాంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలో నిర్ణయిస్తారు. ఇక్కడ లైబ్రరీలో ఆడియో – వీడియో డిజిటల్ బుక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు, పోటీ పరీక్షలకు, ఉన్నత విద్యలకు అవసరమైన ఇ-కంటెంట్ అందుబాటులో ఉంటుంది.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!