బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోండి

బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోండి
రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
నంద్యాల, జులై 20:-
పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ కోరారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, అన్ని నియోజకవర్గాల ఈఆర్వో, ఏఈఆర్వోలు, బిజెపి తరఫున ఎం. గంగాధర్, సిపిఐ పార్టీ తరఫున ఎన్ రంగనాయుడు, సిపిఐఎం ప్రతినిధి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ రియాజ్ భాష, తెలుగుదేశం పార్టీ తరఫున నరేంద్ర కుమార్, వైయస్సార్ సిపి పార్టీ తరఫున అనిల్ అమృతరాజ్, సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా పారదర్శక ఓటర్ల జాబితా తయారు చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 వ తేదీ నుండి నెల రోజులపాటు బిఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, తొలగింపులు, స్త్రీ పురుష నిష్పత్తి, బోగస్ ఓట్లు ఒకే ఇంట్లో 10 ఓటర్లకు మించిన కుటుంబాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బిఎల్ఓ ను యూనిట్ గా తీసుకుని పారదర్శకంగా పరిశీలించి ఓటర్ల జాబితాలో నమోదు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లు కూడా పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. సుమోటోగా ఓటర్లను తొలగించడం కానీ, చేర్చడం గానీ ఉండదని ప్రతి ప్రతి అంశాన్ని బిఎల్వోలు పరిశీలించి నమోదు చేస్తారన్నారు. ఓట్ల జాబితా సవరణపై ప్రతివారం రాజకీయ పార్టీలతో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను కలెక్టర్ ఆదేశించారు. 18 నుండి 19 సంవత్సరాల లోపు యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్ లోని మొత్తం ఓటర్లలో 2 శాతం తొలగింపులు కానీ, 4 శాతానికి మించి చేర్పులు గాని ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.